వైసివి రెడ్డి - దొంగబర్రెగొడ్లు
“మతం గొప్పదే..కానీ దాని కన్నా మనిషి గొప్పవాడు… కళ గొప్పదే.. కానీ దానికన్నా జీవితం గొప్పది…” ఈ మాట ఇప్పుడు ఎందుకు అంటున్నానంటే రాయలసీమ గర్వించదగ్గ రచయిత వైసివి రెడ్డి కథా సంపుటి “గట్టి గింజలు’కు ముందుమాట రాస్తూ దాశరథి రంగాచార్య ఇలా అన్నారు. “రెడ్డిగారి కథలు అన్నీ మంచివనీ చెప్పలేం. అయితే అన్నిటిలోనూ సామాన్యుని జీవితాన్ని చిత్రించడానికి ప్రయత్నించారు. కళావాదులకు ఇందులో “కళ’ లోపించిందనే భావం వస్తే రావొచ్చు. ‘కొయ్యబొమ్మలె మెచ్చుకళ్లకు కోమలుల సౌరెక్కునా?’ అన్నారు గురజాడ. జనజీవితాన్ని చిత్రించిన కథలు రాసినందుకు వైసివిరెడ్డి గారిని అభినందిస్తూ ఇలాంటి రచనలు మరిన్ని రావాలని ఆశిస్తున్నాను” ఫిబ్రవరి 10, 1982లో ఆయన ఈ మాట రాశారు. అంటే ఏది కళ, ఏది కాదు అనే గొడవ అంతకుముందు నుంచే ఉంది. అయితే జీవితం అన్ని కళల కన్నా గొప్పదనే వాదన కూడా అప్పటి నుంచే ఉంది. నాకు దృష్టిలోపమని ఎవరైనా అనుకుంటే అనుకున్నారు కానీ నాకు మటుకు సంభాషణలు తక్కువగా ఉన్న కథలు మంచి కథలుగా అనిపిస్తాయి. ఒకవేళ సంభాషణలు ఎక్కువగా ఉన్నా అవి అనివార్యమైతేనే నాకు అంగీకారం అవుతాయి. అలా సంభాషణలు తక్కువగా ఉండి.. గాఢమైన భావసాంధ్రతను అతి...